ఆసియా గేమ్స్:4x400మీ రిలేలో స్వర్ణం గెలిచిన భారత మహిళలు


4x400 మీ రిలేలో భారత్ మహిళల జట్టు 17వ ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.ప్రియాంక పన్వర్,టింటు ల్యుకా,మన్ దీప్ కౌర్,పూవమ్మ లతో కూడిన భారత్ జట్టు 3:28:68 సమయంలో రేసు ముగించి స్వర్ణాన్ని దక్కించుకుంది.దీంతో వరుసగా నాలుగు సార్లు(2002 బూసాన్ ఆసియా క్రీడలనుండి)భారత్ మహిళల రిలే జట్టు స్వర్ణాన్ని గెలుస్తూ వస్తుంది.2010 ఆసియా క్రీడల్లో నమోదు చేసిన సమయం(3:29.02)కంటే ఈసారి అత్యున్నత సమయం నమోదు చేశారు భారత మహిళల రిలే జట్టు.
జపాన్ 3:30.80 సమయంతో రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని,చైనా 3:32.02 సమయతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.చివరి ల్యాప్ లో పరిగెత్తిన పూవమ్మ అనూహ్యంగా పుంజుకొని జపాన్ క్రీడాకారిణిని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి భారత్ కు వరుసగా 4వ స్వర్ణాన్ని అందించింది.
పురుషుల షాట్ పుట్ విభాగంలో 20 సంవత్సరాల ఇందర్జీత్ 19.63 మీటర్లు విసిరి కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు.ట్రిపుల్ జంప్ లో స్వర్ణాన్ని ఆశించిన అర్పిందర్ సింగ్ 5వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
భారత అథ్లెట్లు ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకున్నారు.అందులో రెండు స్వర్ణాలు,3 రజత,8 కాంస్యాలు ఉన్నాయి.గత ఆసియా క్రీడల కంటే ఒక పతకాన్ని ఎక్కువగా గెలుచుకున్నా స్వర్ణ పతకాల సంఖ్య మాత్రం తగ్గింది.గతసారి 5 స్వర్ణ,2 రజత,5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

No comments:

Designed by vnBloggertheme.com | Copyright © 2013 Radio Jalsa News