తుంగతుర్తి నియోజకవర్గం - సమీక్ష

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించిన విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భాగం తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం. ఇది వరకు మిర్యాలగూడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుంగతుర్తి 2008 డీ లిమిటేషన్ లో భాగంగా భువనగిరిగి మారింది.
తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం 1967 లో ఏర్పడింది. ఇప్పటి వరకు పదిసార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా సిపిఎం మూడుసార్లు,కాంగ్రెస్‌(ఐ) మూడుసార్లు, తెలుగుదేశం రెండుసార్లు,ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు.
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచు కోట అయిన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో సీపీఎం మూడు సార్లు జయకేతనం ఎగురవేసింది.భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి(సీపీఎం) 1967 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 1978,1983లో భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం(సీపీఎం) రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాతి నుండి స్పష్టంగా కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి రాకతో ఇక సీపీఎం నామరూపాలు లేకుండా పోయింది.
1985,1989,1994లలో హ్యాట్రిక్ విజయాలతో దామోదర్ రెడ్డి దూసుకుపోయారు. 1994లో మాత్రం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటి చేసి మూడోసారి విజయం సాధించారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంతో మొదటి సారిగా తుంగతుర్తి అసెంబ్లీ తెదేపా ఖాతాలోకి వెళ్ళింది. అప్పటి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న సంకినేని వెంకటేశ్వర్లు టీడీపీ తరుపున పోటి చేసి దామోదర్ రెడ్డి మీద విజయం సాధించాడు.
2004 ఎనికల్లో మళ్ళీ దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ల మీద 13184 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. 2008 డీ లిమిటేషన్ లో భాగంగా తుంగతుర్తి నియోజక వర్గం ఎస్సీ కి రిజర్వ్ కావడంతో టీడీపీ తరుపున మోత్కుపల్లి నర్సింహులు సమీప కాంగ్రెస్ అభ్యర్థి జి.నర్సయ్య మీద 11863 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈసారి పోటి మరింత రసవత్తరంగా ఉండనుంది. మొదటి సారిగా ఇక్కడ తెరాస పోటిచేస్తుంది. తెలంగాణా రావడానికి కారణం మేమే అని తెరాస, తెలంగాణా తీసుకొచ్చింది మేమే అని కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్తున్నాయి. తెరాస నుండి విద్యార్థి నేత గాదరి కిషోర్, కాంగ్రెస్ నుండి టీజేఏసి నేత అద్దంకి దయాకర్ పోటిచేస్తున్నారు. టీడీపీ నుండి ఈసారి మోత్కుపల్లి ఇక్కడి నుండి పోటీ చేయడం లేదు, అయితే తెదేపా నుండి పి. రజని కుమారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News